sphoortipatrika.com
Newspaper Banner
Date of Publish : 01 February 2026, 11:51 am Digital Edition : SPHOORTI PATRIKA

అంబటి రాంబాబు అరెస్ట్‌పై బుసినే విరుపాక్షి తీవ్ర ఖండన

  • రాష్ట్రంలో “రెడ్‌బుక్ రాజ్యాంగం” అమలవుతోందని ఆరోపణ
  • వైఎస్సార్సీపీ నేతలపై టార్గెట్ అరెస్టులు
  • సూపర్ సిక్స్ హామీలపై ప్రభుత్వ నిర్లక్ష్యం 

ఆలూరు, ఫిబ్రవరి 1 (స్ఫూర్తి పత్రిక):
ఆలూరు నియోజకవర్గంలో ఆదివారం వైఎస్సార్సీపీ నేతలు బహిరంగ నిరసనకు దిగారు. అంబేద్కర్ సర్కిల్ వద్ద నల్ల బ్యాడ్జ్ ధరించి నిర్వహించిన ఈ నిరసనలో ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి పాల్గొని, మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించారు.

దేశంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలులో ఉంటే, రాష్ట్రంలో మాత్రం “లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగం” నడుస్తోందని ఎమ్మెల్యే విరుపాక్షి ఆరోపించారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ అరెస్టులు జరుగుతున్నాయని విమర్శించారు.

కలియుగ వెంకటేశ్వర స్వామి లడ్డూలో ఎలాంటి కల్తీ జరగలేదని, దీనిని సీబీఐ కూడా ధృవీకరించిందని ఎమ్మెల్యే గుర్తుచేశారు. లడ్డూ వివాదాన్ని ప్రజల దృష్టి నుంచి మళ్లించేందుకే అంబటి రాంబాబు అరెస్ట్‌ను చేపట్టారని ఆరోపించారు.

అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన “సూపర్ సిక్స్” హామీలను గాలికి వదిలేసిందని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతులను అణిచివేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పద్ధతులను కాలరాస్తూ జరుగుతున్న ఈ చర్యలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు.

ఈ నిరసన కార్యక్రమంలో వైఎస్సార్సీపీకి చెందిన పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు పోరాటం కొనసాగుతుందని నేతలు స్పష్టం చేశారు.