దేవనకొండ గ్రామపంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న రాముడు ఉత్తమ పంచాయతీ కార్యదర్శిగా ఎంపికయ్యారు. సోమవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి చేతుల మీదుగా ఆయన అవార్డు మరియు ప్రశంస పత్రాన్ని అందుకున్నారు.
మండల పరిధిలోని నేలతలమరి గ్రామానికి చెందిన రాముడు ప్రస్తుతం దేవనకొండ, నల్లచెలిమెల గ్రామపంచాయతీల కార్యదర్శిగా, అలాగే ఇన్చార్జి డిప్యూటీ ఎంపీడీవోగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంకితభావంతో, సేవా దృక్పథంతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించడం ద్వారా మంచి పేరు సంపాదించారు.
గ్రామ సచివాలయాల్లో ప్రజలకు మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్ల ఆయనకు ప్రజల మన్ననలు లభించాయి. ఈ క్రమంలో మూడవసారి ఉత్తమ గ్రామపంచాయతీ కార్యదర్శిగా ఎంపిక కావడం విశేషంగా నిలిచింది.
రాముడికి అవార్డు లభించడంపై ఆయా గ్రామపంచాయతీల సర్పంచులు, గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.