- దీక్ష శిబిరంలోనే గణతంత్ర దినోత్సవం
- ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లుతెరవాలి
- ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంపై ఆగ్రహం
ఎమ్మిగనూరు ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మిగనూరు ప్రధాన కూడలిలో చేపట్టిన నిరాహార దీక్షలు 23వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు దీక్ష శిబిరంలోనే గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నారు.ముందుగా బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం దీక్షలను కొనసాగించారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ, పండుగలను కూడా కుటుంబాలకు దూరంగా గడుపుతూ 23 రోజులుగా దీక్షలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఐదు నియోజకవర్గాలకు అర్హత ఉన్న ఎమ్మిగనూరు ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటిస్తే పశ్చిమ ప్రాంత అభివృద్ధి జరుగుతుందని, ఇది ఏళ్ల నాటి ప్రజల కల అని పేర్కొన్నారు. ఐదు నియోజకవర్గాల ప్రజలు ఎమ్మిగనూరు జిల్లానే కోరుకుంటున్నారని, ప్రభుత్వ ఇంటెలిజెన్స్ నివేదికల ద్వారానైనా ఇది తెలుసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ ప్రాంతంలో ఓట్లు, సీట్లు కావాలనుకునే ప్రజాప్రతినిధులు దీక్షల వైపు కనీసం కన్నెత్తి చూడడం లేదని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మిగనూరు ప్రజలను ఓట్లు అడగడానికి వారు ఎలా వస్తారో చూడాలని, అవసరమైతే వారి ప్రచారాలను అడ్డుకునేందుకు ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు రాజేష్, రంగయ్య, చార్లెస్, చిన్ని, ప్రసాద్, రాము, నాని, రాజోలప్ప, మధు తదితరులు పాల్గొన్నారు.