sphoortipatrika.com
Newspaper Banner
Date of Publish : 14 March 2026, 3:07 pm Digital Edition : SPHOORTI PATRIKA

ప్రధానోపాధ్యాయుడిపై అవినీతి ఆరోపణలు… చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్

– కౌతాళం మండలంలో విద్యాశాఖ అధికారుల తీరుపై ప్రశ్నలు
– 25 రోజులుగా ఫిర్యాదులు చేసినా చర్యలు లేవని ఆరోపణ
– విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందన్న ఆందోళన
– స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన హెచ్చరిక

కౌతాళం, మార్చి 14 (స్ఫూర్తి పత్రిక):

కౌతాళం మండలంలో ఒక ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వెంటనే విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఏఐఎస్ఎఫ్) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్. ఈరేష్ ఒక ప్రకటన విడుదల చేశారు.

ఆయన మాట్లాడుతూ సదరు ప్రధానోపాధ్యాయుడిపై గత కొంతకాలంగా అవినీతి, అక్రమాల ఆరోపణలు వినిపిస్తున్నాయని తెలిపారు. ఈ విషయంపై ఆధారాలతో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

గత 25 రోజులుగా సమస్యను పరిష్కరించాలని కోరుతూ పలు మార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. విద్యాశాఖ అధికారులు విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

అక్షరాస్యతలో వెనుకబడిన ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఇలాంటి ఆరోపణలు విద్యా వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ విషయంలో జిల్లా స్థాయి అధికారులు తక్షణమే స్పందించి పరిస్థితిని పరిశీలించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఒకవేళ సమస్యపై స్పందన లేకపోతే తదుపరి దశలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల నాయకులు హనుమేష్, సాయి వర్మ, స్వామి, గోవిందు, భీమయ్య, ఐనూర్ తదితరులు పాల్గొన్నారు.