- యువత చైతన్యవంతంగా ముందుకు రావాలని పిలుపు
- అమరులకు ఘన నివాళులు అర్పించిన నాయకులు
దేవనకొండ, మార్చి 23 (స్ఫూర్తి పత్రిక):
అమర వీరులు భగత్సింగ్, రాజ్గురు, సుఖదేవ్ల వర్ధంతి సందర్భంగా దేవనకొండ మండలంలో పలు ప్రాంతాల్లో నివాళి కార్యక్రమాలు నిర్వహించారు. మండల కేంద్రంతో పాటు కోటకొండ, తెర్నేకల్, కుంకునూరు గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో నాయకులు పాల్గొని అమరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
డివైఎఫ్ఐ మండల అధ్యక్షుడు వై. మహేంద్ర అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బి. వీరశేఖర్, సిఐటియు మండల కార్యదర్శి ముక్కెల్ల అశోక్, డివైఎఫ్ఐ మండల కార్యదర్శి కే. శ్రీనివాసులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య పోరాటంలో భగత్సింగ్, రాజ్గురు, సుఖదేవ్ కీలక పాత్ర పోషించారని, 23 ఏళ్ల చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణత్యాగం చేశారని గుర్తుచేశారు. వారి పోరాటం కేవలం బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మాత్రమే కాకుండా సమాజంలో ఉన్న అన్యాయం, దోపిడి, అసమానతలపై కూడా సాగిందని పేర్కొన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో కార్పొరేట్ శక్తులు దేశ సంపదను కొద్ది మంది చేతుల్లో కేంద్రీకరిస్తున్నాయని, యువతకు ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయని, రైతులకు గిట్టుబాటు ధరలు లభించడం లేదని, కార్మికులకు తగిన వేతనాలు, భద్రత కల్పించబడడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో భగత్సింగ్ ఆలోచనలు మరింత ప్రాముఖ్యత పొందుతున్నాయని తెలిపారు.
యువతను దారి మళ్లించే అంశాలపై కూడా వారు ఆందోళన వ్యక్తం చేశారు. నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు, మత్తు పదార్థాల వ్యసనం వంటి సమస్యలు యువతను బలహీనపరుస్తున్నాయని, చైతన్యవంతమైన యువత సమాజ మార్పు కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
విద్య, ఆరోగ్యం, ఉపాధి హక్కులుగా మారే సమాజ నిర్మాణం కోసం పోరాటాలు అవసరమని, సమానత్వం, సామాజిక న్యాయం లక్ష్యంగా యువత కృషి చేయాలని సూచించారు.
అనంతరం డ్రగ్స్ వ్యతిరేకంగా ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో యూసుఫ్ భాష, వీరేంద్ర నాయుడు, రంగన్న, పాండురంగడు, పెద్దయ్య, రామాంజనేయులు, బలరాముడు, మధు, రాము, అనిల్ కుమార్, నాగేంద్ర, మహబూబ్ భాషా, సుధాకర్, రవీంద్ర, బజారి, పరమేష్, దొడ్డప్ప తదితరులు పాల్గొన్నారు.

