– కర్నూలు సబ్ డివిజన్లో 100 మంది హోం గార్డులకు పంపిణీ
– సేవా కార్యక్రమంలో భాగంగా దాతలకు సత్కారం
– ఐక్యత, సోదరభావానికి పండుగలు ప్రతీక అని డీఎస్పీ
కర్నూలు, మార్చి 17 (స్ఫూర్తి పత్రిక):
పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని కర్నూలు సబ్ డివిజన్ పరిధిలోని హోం గార్డులకు బియ్యం ప్యాకెట్లను పంపిణీ చేశారు. సోమవారం కర్నూలు పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 100 మంది హోం గార్డులకు బియ్యం ప్యాకెట్లు అందజేశారు.
కోడుమూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ తబ్రేజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కర్నూలు డీఎస్పీ జె. బాబు ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని హోం గార్డులకు బియ్యం ప్యాకెట్లను అందజేశారు.
ఈ సందర్భంగా సమాజ సేవలో భాగస్వాములైన మహేశ్వర్ రెడ్డి, ఈదుల దేవర బండ సుభాన్, క్వాలిటీ టైల్స్ రఫీ, మదీనా స్వీట్స్ రహమతుల్లాలను డీఎస్పీ శాలువాలతో సత్కరించి వారి సేవా భావాన్ని అభినందించారు.
అనంతరం మౌలానా సలామ్ ప్రత్యేక ప్రార్థనలు (దువా) నిర్వహించి అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు పాటిస్తూ విధి నిర్వహణలో నిమగ్నమై ప్రజల రక్షణ కోసం కష్టపడుతున్న హోం గార్డులను అభినందించారు. పోలీసు శాఖ హిందూ–ముస్లింల ఐక్యతకు, సమానత్వానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.
పండుగలు ప్రజల్లో సోదరభావాన్ని పెంపొందిస్తాయని, కులమతాలకు అతీతంగా అందరూ ఐక్యంగా జీవించి శాంతియుత సమాజ నిర్మాణానికి సహకరించాలని పిలుపునిచ్చారు. పోలీసు అధికారులు, సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులు పండుగలను ఆనందంగా జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలిపారు.