- కోట్లాది ప్రజల ఆశలకు ప్రతిబింబంగా ప్రజాచైతన్య ఉద్యమం
- రాష్ట్ర రాజకీయాలను సమూలంగా మార్చిన చారిత్రక పాదయాత్ర
అమరావతి, జనవరి 27 (స్ఫూర్తి పత్రిక) :
రాష్ట్రంలో కోట్లాది ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ ప్రజాచైతన్యమే లక్ష్యంగా సాగిన ‘యువగళం’ పాదయాత్రకు మూడేళ్లు పూర్తయ్యాయి. యువనేత నారా లోకేష్ నాయకత్వంలో ప్రారంభమైన ఈ పాదయాత్ర, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక మలుపుగా నిలిచింది.జగన్మోహన్ రెడ్డి పాలనలో చోటుచేసుకున్న అరాచకాలకు వ్యతిరేకంగా సమరశంఖం పూరిస్తూ, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కార దిశగా రాజకీయాలను మళ్లించడమే యువగళం పాదయాత్ర ప్రధాన ఉద్దేశ్యం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ ఈ పాదయాత్ర ద్వారా ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమై, రాష్ట్ర రాజకీయాలను కొత్త దిశలో నడిపించారు.2023 జనవరి 27న, కుప్పంలోని శ్రీ వరదరాజస్వామి పాదాల చెంత ప్రారంభమైన యువగళం పాదయాత్ర, 11 ఉమ్మడి జిల్లాల మీదుగా సాగింది. ఈ పాదయాత్రలో 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 232 మండలాలు/మున్సిపాలిటీలు, 2,097 గ్రామాలు కవర్ చేస్తూ, 226 రోజుల పాటు 3,132 కిలోమీటర్ల మేర కొనసాగింది.యువగళం పాదయాత్ర సాగిన 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 90 చోట్ల కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించడం, ఈ ఉద్యమం ప్రజల్లో ఎంతటి ప్రభావం చూపిందో స్పష్టంగా తెలియజేస్తోంది. ప్రజల నమ్మకం, విశ్వాసం యువగళం ద్వారా రాజకీయంగా బలంగా వ్యక్తమైంది.ఉద్యోగాలు లేక నిరాశ, నిస్పృహలో కూరుకుపోయిన యువత ఒకవైపు, భద్రత కరువైన మహిళలు మరోవైపు, అడ్డగోలు బాదుడుతో బతుకుబారం అయిన సామాన్య ప్రజలు ఇంకోవైపు — వీరందరికీ “నేనున్నాను” అంటూ భరోసా ఇచ్చారు యువనేత నారా లోకేష్. ప్రజల కష్టాలు వింటూ, కన్నీళ్లు తుడుస్తూ సాగిన ఈ పాదయాత్ర ప్రజల్లో అపూర్వమైన చైతన్యాన్ని నింపింది.