sphoortipatrika.com
Newspaper Banner
Date of Publish : 17 March 2026, 3:35 pm Digital Edition : SPHOORTI PATRIKA

వరుస కథనాలు… స్పందన శూన్యం! ఎక్సైజ్ శాఖ మౌనం ఎందుకు?

– వరుస కథనాలు వెలువడినా మార్పు కనిపించదు
– గ్రామాల్లో బహిరంగంగా కొనసాగుతున్నాయన్న ఆరోపణలు
– ఇప్పటివరకు అధికారుల నుంచి స్పందన లేకపోవడంపై ప్రశ్నలు
– పై అధికారులు జోక్యం అవసరమంటున్న ప్రజలు

దేవనకొండ, మార్చి 17 (స్ఫూర్తి పత్రిక):

దేవనకొండ మండలంలో బెల్ట్ మద్యం విక్రయాలపై వరుసగా కథనాలు వెలువడుతున్నప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. గ్రామాల్లో మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి.తాజాగా రాత్రివేళల్లో వాహనాల ద్వారా మద్యం గ్రామాలకు తరలిస్తున్నట్లు దృశ్యాలు బయటకు రావడంతో ఈ వ్యవహారం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. చిన్న బంకులు, దుకాణాల వద్ద మద్యం విక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది.ఇప్పటికే ఈ అంశంపై వరుస కథనాలు వెలువడినప్పటికీ పరిస్థితిలో మార్పు కనిపించకపోవడం గమనించాల్సిన అంశంగా మారింది. ముఖ్యంగా సంబంధిత శాఖల నుంచి ఇప్పటివరకు ఎటువంటి స్పష్టమైన స్పందన రాకపోవడం ప్రజల్లో అనుమానాలకు తావిస్తోంది.గ్రామాల్లో ఈ విధంగా మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయన్న ఆరోపణల మధ్య, ఈ దందా ఎవరి సంరక్షణలో నడుస్తోందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పర్యవేక్షణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందా? లేదా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.ఎక్సైజ్ శాఖ పాత్రపై కూడా ప్రజల్లో చర్చ జరుగుతోంది. వరుసగా వార్తలు వెలువడుతున్నప్పటికీ పరిస్థితిలో మార్పు లేకపోవడం, పర్యవేక్షణలో లోపాలున్నాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సంబంధిత అధికారులు పరిస్థితిని సమీక్షించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.గ్రామీణ ప్రాంతాల్లో ఈ తరహా కార్యకలాపాలు కొనసాగడం వల్ల యువతపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత శాఖలు మరింత కట్టుదిట్టంగా పర్యవేక్షణ చేపట్టాలని కోరుతున్నారు.ఇప్పటికైనా పైస్థాయి అధికారులు స్పందించి కిందిస్థాయి సిబ్బంది పనితీరుపై సమీక్ష జరిపి పరిస్థితిని సరిచేయాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.