- నూతన దంపతులకు ఆశీర్వాదాలు
- కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా
ఆలూరు, మార్చి 22 (స్ఫూర్తి పత్రిక):
ఆలూరు నియోజకవర్గంలోని అరికేర గ్రామంలో నిర్వహించిన వివాహ కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్ సురేందర్ రెడ్డి హాజరయ్యారు. మండల పార్టీ నాయకుడు వీరేష్ సోదరుని వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ వివాహం అనేది ప్రేమ, పరస్పర విశ్వాసంతో ప్రారంభమయ్యే జీవితంలోని ముఖ్యమైన ఘట్టమని పేర్కొన్నారు. నూతన దంపతులు కలకాలం సుఖశాంతులతో, అష్టైశ్వర్యాలతో సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు.అనంతరం గ్రామంలోని పార్టీ నాయకులు, యువకులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. పార్టీ కార్యకర్తలు ఎదుర్కొనే సమస్యలపై స్పందిస్తూ, ఏ పరిస్థితుల్లోనైనా కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని, సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం జరగదని పేర్కొంటూ నాయకత్వంపై నమ్మకం ఉంచాలని కోరారు.ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి కురువ శశికళ కృష్ణమోహన్, చిప్పగిరి మండల కన్వీనర్ మారయ్య, హోళగుంద మండల కన్వీనర్ షఫీ, ఎంపీటీసీ దేవరాజు, సీనియర్ నాయకులు కేశం వెంకటరెడ్డి, శేషాద్రి రెడ్డి, రాఘవేంద్ర రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మల్లికార్జున, ఓబులేసు, రాజశేఖర్, మోదీన్ భాష, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.