రైతులకు సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లాలని సూచనలు
పురుగు మందుల వినియోగంలో జాగ్రత్తలు అవసరం
రైతుల ఆదాయ వృద్ధికి పలు కార్యక్రమాలు
దేవనకొండ, మార్చి 09 (స్ఫూర్తి పత్రిక):
దేవనకొండ మండల కేంద్రంలోని రైతు సేవా కేంద్రంలో సుస్థిర పత్తి సాగుపై అవగాహన కార్యక్రమం సోమవారం నిర్వహించారు. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించడం మరియు పత్తి సాగులో నూతన విధానాలను పరిచయం చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా వ్యవసాయ విశ్లేషకుడు మురళి మాట్లాడుతూ ఎంఏఆర్ఐ సంస్థ ఆధ్వర్యంలో సుస్థిర పత్తి సాగుకు సంబంధించిన పద్ధతులపై రైతు సేవా కేంద్రం సిబ్బంది మరియు డీలర్లకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. రైతులకు ప్రయోజనం చేకూరేలా వివిధ శిక్షణా కార్యక్రమాలు, అవగాహన ప్రచారాలు, ప్రదర్శన ప్లాట్లు ఏర్పాటు చేయడం జరుగుతోందని చెప్పారు.పొలాల్లో నీటి నిల్వ కోసం కుంటలను ఏర్పాటు చేయడం, భూసారాన్ని మెరుగుపరచడం మరియు రైతుల ఆదాయాన్ని పెంచేందుకు సుస్థిర జీవనోపాధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని వివరించారు. అలాగే రైతులకు ఉపయోగపడే విధంగా రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను వివరించి రైతులు కొత్త పద్ధతులను అవలంబించాలని సూచించారు.మండల వ్యవసాయ శాఖ అధికారులు మాట్లాడుతూ విచక్షణారహితంగా రసాయన ఎరువులు మరియు పురుగు మందులు వాడకుండా సేంద్రియ వ్యవసాయం వైపు రైతులు మొగ్గు చూపాలని తెలిపారు. భూసారాన్ని పెంచే విధంగా వ్యవసాయ పద్ధతులను అనుసరించాలని సూచించారు.పాత పంట రకాలను వదిలి అధిక దిగుబడిని ఇచ్చే నూతన వంగడాలను సాగు చేయాలని రైతులకు సూచించారు. ముఖ్యంగా అత్యంత విషపూరితమైన హెచ్హెచ్పీఎస్ మందులు మరియు మిశ్రమ పురుగు మందుల వినియోగాన్ని తగ్గించడం అవసరమని తెలిపారు. అవసరానికి సరిపడే మందులు మాత్రమే వాడేలా రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.అదేవిధంగా రైతులు మందులు పిచికారీ చేసే సమయంలో రక్షణ దుస్తులు ఉపయోగించాలనే విషయంపై కూడా అవగాహన కల్పించారు. వ్యవసాయ శాఖ అధికారులు, డీలర్లు మరియు సంస్థల ప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తే రైతులకు మంచి ఫలితాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో దేవనకొండ వ్యవసాయ అధికారి ఉషారాణి, పత్తికొండ వ్యవసాయ శాఖ సాంకేతిక అధికారి మున్నెమ్మ, వెల్దుర్తి వ్యవసాయ అధికారి అక్బర్ బాషా, ఎంఏఆర్ఐ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మురళి, దేవనకొండ మరియు ఆస్పరి మండలాల వీఏఏలు, డీలర్లు మరియు వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

