ఎల్లార్తి గ్రామంలో అవగాహన ర్యాలీ
ఆడపిల్లల భద్రత మనందరి బాధ్యత అని పిలుపు
బాల్య వివాహాల దుష్పరిణామాలపై వివరణ
ఎంవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం
హోళగుంద, మార్చి 11 (స్ఫూర్తి పత్రిక):
బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని, అలాంటి ఘటనలను సమాజం మొత్తం కలిసి అరికట్టాల్సిన అవసరం ఉందని హోళగుంద ఎస్సై దిలీప్ కుమార్ గురజాల అన్నారు. హోళగుంద మండల పరిధిలోని ఎల్లార్తి గ్రామంలో ఎంవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాల్య వివాహాల నియంత్రణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హోళగుంద ఎస్సై దిలీప్ కుమార్ గురజాల హాజరయ్యారు. ర్యాలీ ద్వారా గ్రామ ప్రజలకు బాల్య వివాహాల వల్ల కలిగే సమస్యలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ బాల్య వివాహ నిషేధ చట్టం–2006 ప్రకారం అమ్మాయిలకు 18 సంవత్సరాలు, అబ్బాయిలకు 21 సంవత్సరాల వయస్సు పూర్తి కాకుండా వివాహం జరిపించడం నేరమని తెలిపారు. చట్టాన్ని అతిక్రమించి బాల్య వివాహాలను నిర్వహించిన తల్లిదండ్రులు, నిర్వాహకులు మరియు ప్రోత్సహించినవారు కూడా శిక్షార్హులవుతారని హెచ్చరించారు.
బాల్య వివాహాల వల్ల చిన్న వయస్సులోనే కుటుంబ బాధ్యతలు మోసే పరిస్థితి ఏర్పడుతుందని, దాని వల్ల అనేక సామాజిక సమస్యలు తలెత్తే అవకాశముందని చెప్పారు. చిన్న వయసులో గర్భధారణలు ఎక్కువగా జరగడం, మాతృ మరణాలు మరియు శిశు మరణాలు పెరగడం వంటి సమస్యలు కూడా తలెత్తవచ్చని తెలిపారు.
అదేవిధంగా బాల్య వివాహాలు బాలికల శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని వివరించారు. ఆడపిల్లల భద్రత, విద్య మరియు భవిష్యత్తు కోసం బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎంవీ ఫౌండేషన్ మండల కోఆర్డినేటర్ సేవా నాయక్, క్లస్టర్ ఆర్గనైజర్లు భారతి, శేఖన్న, మల్లేశ్వరి, విజయ్, ఎల్లార్తి ఉన్నత పాఠశాల హెచ్ఎం మధుసూధన్, ఉపాధ్యాయులు వెంకటేష్, ధనుంజయ, కానిస్టేబుల్ సంజీవ్, నాయకులు ఎస్.కె. గిరి, అంగన్వాడీ టీచర్లు లేపాక్షి, ఇందిరమ్మ, ఆశా వర్కర్ మహేశ్వరి మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

