– అగ్ని ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు పాటించాలి
– కరెంటు వైర్లు, పొడి వాతావరణంపై అప్రమత్తంగా ఉండాలి
– ప్రమాదం జరిగితే వెంటనే ఫైర్ సర్వీసులకు సమాచారం ఇవ్వాలి
హోళగుంద, మార్చి 17 (స్ఫూర్తి పత్రిక):
వేసవి కాలంలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో రైతులు గడ్డివాముల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని ఎస్సై దిలీప్ కుమార్ గురజాల సూచించారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, పొడి వాతావరణం కారణంగా అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉందని ఆయన తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడ్డివాముల వద్ద కరెంటు వైర్లు ఉండకుండా చూసుకోవాలని, ఎలక్ట్రికల్ వైర్ల రాపిడి వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. పశువుల మేత కోసం నిల్వ ఉంచిన గడ్డివాము ఒక్కసారిగా మంటలకు ఆహుతి అయితే రైతులకు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని హెచ్చరించారు.గడ్డివాములను తగిన కవర్లతో కప్పి ఉంచడం ద్వారా వేడి ప్రభావాన్ని తగ్గించవచ్చని తెలిపారు. అలాగే గడ్డివాముల చుట్టుపక్కల పొడి చెత్త, దహనానికి దారితీసే పదార్థాలు ఉండకుండా శుభ్రంగా ఉంచాలని సూచించారు.ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదాలు సంభవించిన వెంటనే ఫైర్ సర్వీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 101 టోల్ ఫ్రీ నంబర్ లేదా ఫైర్ కంట్రోల్ నంబర్ 9100108101 కు సమాచారం అందించాలని తెలిపారు.రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే అగ్ని ప్రమాదాలను నివారించవచ్చని, అప్రమత్తతే రక్షణకు మార్గమని ఎస్సై పేర్కొన్నారు.

