వ్యక్తిగత వివాదం ఘర్షణకు దారి
విచక్షణారహిత దాడితో తీవ్ర గాయాలు
నిందితుడు పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం
ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు
హోళగుంద, మార్చి 31 (స్ఫూర్తి పత్రిక):
కర్నూలు జిల్లా హోళగుంద మండలంలోని నేరనికి తాండ గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వ్యక్తిగత వివాదం ఘర్షణకు దారి తీసి, ఓ వ్యక్తిపై గొడ్డలితో దాడి చేయడం స్థానికంగా కలకలం రేపింది.గ్రామానికి చెందిన రాము నాయక్పై అదే గ్రామానికి చెందిన రాఘవేంద్ర నాయక్ విచక్షణారహితంగా గొడ్డలితో దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో రాము నాయక్ తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో పడిపోయాడు.ఘటనను గమనించిన గ్రామస్తులు వెంటనే స్పందించి గాయపడిన రాము నాయక్ను ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.ఈ ఘటనకు కారణం వ్యక్తిగత విభేదాలేనని ప్రాథమికంగా భావిస్తున్నప్పటికీ, ఇతర కోణాల్లో కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. కొన్ని వర్గాల్లో వినిపిస్తున్న అనుమానాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.ఘటన అనంతరం నిందితుడు రాఘవేంద్ర నాయక్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

