- ఉపాధ్యాయుల సేవలు అభినందనీయం
- విద్యార్థుల్లో క్రమశిక్షణ, విలువలు పెంపొందించాలి
- పాఠశాలలో ఘనంగా గురుపూజోత్సవ కార్యక్రమం

దేవనకొండ, సెప్టెంబర్ 5 (స్ఫూర్తి పత్రిక):
దేవనకొండ పట్టణంలోని రెయిన్బో ఆంగ్ల మాధ్యమ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేవనకొండ మండల విద్యాశాఖ అధికారి–1 ఉస్మాన్ భాష, మండల విద్యాశాఖ అధికారి–2 నిర్మల దేవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయుల సేవలను కొనియాడుతూ విద్యార్థులతో కలిసి గురుపూజోత్సవాన్ని నిర్వహించారు. విద్యార్థుల జీవితాల్లో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని, విద్యాబోధనతో పాటు మంచి నడవడి, క్రమశిక్షణ, నైతిక విలువలను పెంపొందించడంలో ఉపాధ్యాయులు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని వారు పేర్కొన్నారు.
విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరై చదువుపై ఆసక్తి పెంచుకోవాలని, ఉపాధ్యాయుల సూచనలు పాటిస్తూ ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రతి విద్యార్థి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు.కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించింది. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులు తమ గురువులకు శుభాకాంక్షలు తెలిపి కృతజ్ఞతలు వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

