- అంగన్వాడీలను మోడల్ కేంద్రాలుగా మార్చాలి
- SAM, MAM పిల్లలు లేకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ
- బాలికల భవిష్యత్తే లక్ష్యం: మహిళా శిశు సంక్షేమంపై కలెక్టర్ స్పష్టత
పత్తికొండ ,జనవరి 28 (స్ఫూర్తి పత్రిక):
అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీ స్త్రీలు, పిల్లలకు సమగ్రమైన సేవలు అందించాలని, జిల్లాలో ఎక్కడా సామ్ (SAM), మామ్ (MAM) ఉన్న పిల్లలు ఉండకుండా అధికారులు కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశించారు.
బుధవారం పత్తికొండ ఎం కన్వెన్షన్ హాల్లో పత్తికొండ డివిజన్ సిడిపిఓలు, అంగన్వాడీ సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలతో మహిళా శిశు సంక్షేమ పథకాల అమలుపై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు నాణ్యమైన భోజనం అందించడంతో పాటు విద్యాబోధన, ఆటపాటలు సక్రమంగా నేర్పించాలని సూచించారు. పిల్లలందరూ ఉదయం 9 గంటలకల్లా కేంద్రానికి రావాలని, ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు తప్పనిసరిగా అంగన్వాడీ కేంద్రంలోనే ఉండేలా చూడాలన్నారు. పిల్లలు శుభ్రంగా స్నానం చేసి, శుభ్రమైన బట్టలు ధరించారా లేదా అనే అంశాన్ని కార్యకర్తలు గమనించాలని తెలిపారు.
కేవలం రైమ్స్, ABCలు లేదా 123లకే పరిమితం కాకుండా క్రమశిక్షణ, వస్తువులను పంచుకోవడం, కేరింగ్ వంటి విలువలను కూడా పిల్లలకు నేర్పించాలని చెప్పారు. టీవీల ద్వారా దృశ్య రూపంలో పాఠాలు అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో సామ్, మామ్ ఉన్న పిల్లల సంఖ్య శూన్యానికి చేరాలని స్పష్టం చేశారు.
గర్భిణీలు, బాలింతలకు టేక్ హోమ్ రేషన్ (THR) పంపిణీ, కౌన్సెలింగ్, హోమ్ విజిట్స్ నిర్వహించడం అంగన్వాడీ కార్యకర్తల ప్రధాన బాధ్యత అని కలెక్టర్ తెలిపారు. ప్రతి నెల మొదటి వారంలోనే THR పంపిణీ పూర్తి చేయాలని, అటెండెన్స్తో పాటు ఇతర ప్రభుత్వ పథకాల వివరాలను ప్రభుత్వం అందించిన మొబైల్ యాప్లలోనే ఖచ్చితంగా అప్లోడ్ చేయాలని ఆదేశించారు.
అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అయ్యే గుడ్లు, రేషన్ తదితర సరుకులను నిశితంగా పరిశీలించాలని, నాణ్యత లేకపోతే వెంటనే తిరస్కరించి ఫోటోలు తీసి ఆధారాలు ఉంచుకోవాలని సూచించారు. నాణ్యత లేని వస్తువులను అంగీకరిస్తే తనిఖీల సమయంలో చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రతిరోజూ కనీసం రెండు ఇళ్లను సందర్శించి తల్లిదండ్రులకు పిల్లల ఆరోగ్యం, బాలికల విద్య ప్రాధాన్యతపై అవగాహన కల్పించాలని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలు కేవలం భోజనం అందించే స్థలాలు మాత్రమే కాకుండా బాలికల భవిష్యత్తును తీర్చిదిద్దే కేంద్రాలుగా మారాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ఖాళీ ఉన్న స్థలంలో మునగ చెట్లు, ఆకుకూరలు పెంచాలని ఐసిడిఎస్ పీడీని ఆదేశించారు. 11 నుంచి 18 ఏళ్ల బాలికల వివరాలతో సచివాలయాల్లో మహిళా పోలీసులు రిజిస్టర్ నిర్వహించాలని, బాలికలు కనిపించకపోయినా లేదా బాల్య వివాహాల సమాచారం వచ్చినా వెంటనే స్పందించాలని ఆదేశించారు.
ఐవిఆర్ఎస్ కాల్స్లో ప్రజల నుంచి అంగన్వాడీ సేవలపై సానుకూల స్పందన పెరిగేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి అంగన్వాడీ కేంద్రం ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి రోజూ అందించే భోజనం, గుడ్లు, పాలు, గర్భిణీలకు ఇచ్చే రేషన్ ఫోటోలు షేర్ చేయాలని కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ పీడీ విజయ, అంగన్వాడీ సిడిపిఓలు, సూపర్వైజర్లు, వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

